Sunday 2 December 2018

ఇది ఒక కొత్త అనుభవంగా అభివర్ణిస్తున్నారు.

ఒరిస్సా లోని రఘురాజ్ పూర్ హస్త కళలకు,శిల్ప కళలకు పెట్టింది పేరు.అంతర్జాతీయం గా ఇపుడు అనేకమంది ఈ చిన్న పట్టణానికి వచ్చి ఇక్కడి పట చిత్ర కళ ని ఇంకా ఇతర వాటిని అభ్యసిస్తున్నారు.ఎమ్మా గార్డ్నర్ ఆస్ట్రేలియా కి చెందిన కళాకారిణి.వస్త్రాల మీద వేసే బొమ్మలకి సంబందించిన కళ,పటచిత్ర కళ,తాళపత్ర కళ తనని ఆకర్షించినవని కనుక ఇక్కడకి వచ్చి నేర్చుకుంటున్నట్లు తెలిపారు.ఇటలీ నుంచి గిలియ వయొలంటి వచ్చి ఓ వారం నుంచి కొబ్బరి కాయల మీద,పేపర్ మీద వేసే కొన్ని స్థానిక డిజైన్లను నేర్చుకుంటున్నారు. ఇవి పురాణాలకి సంబందించిన చిత్రాలు ఇంకా ఇతర వాటికి చెందినవి.



వివిధ రాళ్ళ నుంచి,ఆకులనుంచి ఇక్కడి కళాకారులు తయారు చేసే సహజ రంగుల మిశ్రమాల గురించి తెలుసుకుంటున్నారు.ఎలియనోరా పేసి ఒక లా స్టూడెంట్ ఇటలీ దేశం లో.ఇక్కడి కళాకారుల జీవన విధానం గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తి గా ఉందని చెపుతున్నారు.ఇది ఒక కొత్త అనుభవంగా అభివర్ణిస్తున్నారు. 

Tuesday 7 August 2018

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కధలు (పుస్తక పరిచయం)


పెద్దిభొట్ల సుబ్బరామయ్య పేరెన్నిక గన్న తెలుగు కధకులు.నిత్య జీవిత సత్యాలను ఎంతో హృద్యంగా చిత్రించి తనదైన శైలి లో తెలుగు పాఠకులకు అందించారు.ఆయన కధలను ఏరి అరసం సాహిత్య సంస్థ ప్రచురించిన పుస్తకం ఈ పెద్దిభొట్ల సుబ్బరామయ్య కధలు.దీనిలో 12 కధలు ఉన్నాయి.కళ్ళజోడు,అలజడి,దగ్ధ గీతం,సతీ సావిత్రి,కొళందవేలు బొమ్మ,చుక్కమ్మ కధ,ఇంగువ ఇంకా తదితర కధలు.మాన జీవితం లోని విషాద సన్నివేశాలను ఇంకా సమస్యలను అతి సామాన్య శైలి లో మనోరంజకంగా వెలయించారు.సాహిత్య అకాడెమీ గ్రహీత అయిన సుబ్బరామయ్య కధలను ప్రతి అభిరుచి కలిగిన పాఠకుడూ చదవాలి.

పేజీలు:112 ,వెల: రూ.50/-

ప్రతులకు: అభ్యుదయ రచయితల సంఘం,గుంటూరు జిల్లా శాఖ.
101,బృందావన్ పార్క్ రెసిడెన్సి,7వ లేన్,ఎస్.వి.ఎన్.కాలని,గుంటూరు-522006,సెల్:92915 30714  

Sunday 22 July 2018

బోర్డు తిప్పేసిన మరో సంస్థ...



ద హేపీ ఫ్యూచర్ మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సొసైటీ పేరు తో తమిళనాడు ,ఆంధ్ర,తెలంగాణా రాష్ట్రాల్లో బ్రాంచీలు తెరిచిన సంస్థ  తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల బోర్డ్ తిప్పేసినట్లుగా ఈ రోజు పత్రిక ల్లో వెలుగు చూసింది.స్థానిక ప్రముఖుల తో ఓపెనింగ్ లు చేయించి కొన్ని నెలల పాటు ఆఫీస్ లు నడిపిన ఈ సంస్థ తమిళనాడు లోని కోయంబత్తూర్ లో ప్రధాన కార్యాలయాన్ని కలిగిఉంది.నిరుద్యోగులు కూడా ఈ సంస్థ లో ఉద్యోగాలు పొందడానికి పెద్ద మొత్తాలు చెల్లించినట్లు తెలుస్తున్నది.

తమ వెబ్ సైట్ లో అనేక సేవలు అందిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నది.ఎలక్ట్రానిక్స్,సూపర్ మార్కెట్,ఆర్గానిక్ ఉత్పత్తులు ఇంకా ఇతర రంగాల్లో సేవలు అందిస్తున్నట్లు ప్రకటనలు చేసింది. కొత్తగూడెం,ఖమ్మం ఇంకా అనేక చోట్ల ఫిర్యాదులు నమోదు అయినట్లు తెలుస్తున్నది. 

Saturday 16 June 2018

గాడిదల కి ముప్పు గా మారిన చైనా


ఆఫ్రికా ఖండం లోని 14 దేశాలు ఈ మధ్య తమ దేశాల నుంచి గాడిదలు కనుమరుగయ్యే ప్రమాదాన్ని గుర్తించి వాటి సం రక్షణకి చర్యలు చేపడుతున్నాయి.కెన్యా,బుర్కినా ఫాసో ,ఈజిప్ట్,నైజీరియ వంటి దేశాల నుంచి ఏడాదికి వెయ్యి గాడిదల చొప్పున వాటి చర్మాల నిమిత్తం చంపబడుతున్నాయి.దానికి కారణం ఏమిటో తెలుసా ..! చైనా దేశం లో ఈ గాడిదల చర్మానికి విపరీతమైన డిమాండ్ ఉన్నది.ఈ చర్మం నుంచి తీసిన గెలాటిన్ ని చైనా సంప్రదాయ వైద్యం లో బాగా వాడతారు.దానితో ఆ దేశం లో గాడిదలు చివరకి తక్కువై పోయి ఇతర దేశాల పై ఆధారపడుతున్నారు.ఆఫ్రికా లోని దేశాల్లో ఈ వ్యాపారం ఊపందుకుంది.దానితో వారికి గాడిదలు కరువై వాటి సం రక్షణ కోసం చర్యలు ప్రారంభించారు.Tunza punda wako (నీ గాడిదను దక్షించుకో) అనే స్వాహిలీ భాష లోని స్లోగన్ తో ప్రస్తుతం అక్కడ ఉద్యమం నడుస్తున్నది.  

Wednesday 25 April 2018

ఈ పేరు తో హోటల్ ని ఎవరైనా ఊహించగలరా..?


ఓల్గా సే గంగా అనే ప్రసిద్ధ నవల  అందరకీ తెలిసిందే.రాహుల్ సాంకృత్యాయాన్ రచించిన ఆ పుస్తకానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది.ఎవరైనాపుస్తకం చదువుతారు కాకపోతే మంచి రచన గా గుర్తుంచుకుంటారు.కాని పశ్చిమ గోదావరి జిల్లా లోని కుకునూరు అనే మండల కేంద్రం లో మటుకు ఆ పుస్తకం పేరు ని తమ హోటల్ కి పెట్టుకున్నాడు ఒక పుస్తక ప్రియుడు.ఇక్కడ పైన చూస్తున్నారు గా ఆ చిత్రందాని గురించి ఆ యజమాని రాం బాబు మాట్లాడుతూ వారి తండ్రి గారు ఈ పేరు పెట్టినట్లు దానిని తాను కొనసాగిస్తున్నట్లు తెలుపుతున్నారు.ఈ స్పూర్తి తో ఇంకా అనేకామంది ఇటువంటి మంచి విషయాల్ని అనుకరిస్తే బాగుంటుంది కదూ ..! 

Tuesday 30 January 2018

అడవి లో బయట పడిన అపురూప శిల్పసంపద -ఉనాకోటి



త్రిపుర రాష్ట్రం యొక్క రాజధాని అగర్తల కి సుమారు 178 కి.మీ.దూరం లో దట్టమైన అడవి లో  ఉనాకోటి అనే ఒక ప్రదేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఇంతకాలం ఈ అడవి లో ఉండిపోయిన గొప్ప శిల్పసంపదని చూడాలని ప్రపంచం  తపిస్తున్నది.ఎందుకంటే వీటి ప్రత్యేకతలే వేరు అని చెప్పాలి.పెద్ద పెద్ద గుట్టల మీద రాతి ని చూడచక్కని శిల్పాలు గా మలిచారు. ఇవి భారత దేశం లోని ఇతర గుళ్ళ లోని  శిల్పశైలి లో కాకుండా స్థానిక ప్రాచీన తెగల వారసత్వ వైవిధ్యాన్ని తెలుపుతుంది.


8 లేదా 9 వశతాబ్దం లో వీటిని చెక్కి ఉండవచ్చునని భావిస్తున్నారు.శివుడు,పార్వతి,గంగ,దుర్గ,గణేశుడు ఇలా వివిధ శిల్పాలు దర్శనమిస్తున్నాయి.30 నుంచి 40 అడుగుల శిల్పాలు చూడవచ్చును.ఆరుబయట గుట్టల లో ఇంతకాలం అరణ్యం లో ఎవరూ పెద్ద గా వీటిని పట్టించుకోలేదు. నార్త్ త్రిపుర లో జంప్యు హిల్స్ లో ఉన్న ఈ ప్రదేశాన్ని  ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది పరిచే దిశలో సాగుతున్నది.



      

Thursday 7 December 2017

డాన్స్ చేస్తూ చిక్కిన ఆ పోలీస్ అధికారి


పశ్చిమ బెంగాల్ లోని హీరా పూర్ అనే పోలీస్ స్టేషన్ లో ASI గా పనిచేస్తున్న కృస్ణ సదన్ మండల్ కి తాను కోరుకున్న చిత్తరంజన్ స్టేషన్ కి బదిలీ అయింది.చివరి రోజున ఆ ఆనందాన్ని చక్కగా తనివి దీరా డాన్స్ వేస్తూ వ్యక్తపరుచుకున్నాడు.మొత్తానికి కొంతమంది ఎలాగో ఈ వ్యవహారాన్ని వీడియో తీశారు. దానితో ఇది వైరల్ అయి ఉన్నతాధికారులు ఈయన మీద విచారణకి ఆదేశించారు.ఈ వీడియో డిసెంబర్ 2 న తీసినట్లుగా ఉన్నది.సర్వీస్ రివాల్వర్,యూనిఫాం ధరించి స్టేషన్ లో డాన్స్ చేస్తుండడం తో అసాన్సోల్-దుర్గాపోర్ కమీషనర్ ఈ విషయం లో విచారణకి ఆదేశించారు.