Thursday 20 July 2023

సింగపూర్ పాస్ పోర్ట్ ర్యాంకింగ్ ప్రపంచం లోనే నంబర్ వన్..! మరి మన దేశం ర్యాంక్ ఎంతో తెలుసా..?


 సింగపూర్ పాస్ పోర్ట్ కి ప్రపంచ స్థాయి ర్యాంకింగ్ లో మొదటి స్థానం వచ్చింది. గతం లో ఈ స్థానం లో ఉన్న జపాన్ ని పక్కకి తోసి సింగపూర్ మొదటి స్థానం లోకి వచ్చింది. సింగపూర్ పాస్ పోర్ట్ కలిగి ఉన్నవాళ్ళు ఇకమీదట ఎలాంటి వీసా లేకుండా 192 దేశాల్ని సందర్శించవచ్చు.2021 లో కూడా సింగపూర్ టాప్ స్థానం లోకి వచ్చింది.అయితే తర్వాత జపాన్ ఆ స్థానాన్ని ఆక్రమించింది.

ఇకపోతే జర్మనీ,ఇటలీ,స్పెయిన్ దేశాలు రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.ఈ దేశాల పాస్పోర్ట్ లు ఉన్నవారు వీసా లేకుండా 190 దేశాల్ని సందర్శించవచ్చు. 189 దేశాల డెస్టినేషన్స్ తో ఫ్రాన్స్,ఆస్ట్రియా,ఫిన్ లాండ్,స్వీడన్,లక్జం బర్గ్,దక్షిణ కొరియా దేశాలు మూడో స్థానం లో నిలిచాయి.కాగా అమెరికా మాత్రం 8 వ స్థానం లో నిలిచింది. వీసా రెసిప్రోసిటి తక్కువ ఉండటం వల్ల అమెరికా ర్యాంక్ దిగజారుతూ వస్తోంది.

1 నుంచి 10 ర్యాంక్ ల మధ్యలో ఉన్న 34 దేశాలు గత పదేళ్ళలో తక్కువ పెరుగుదల ని నమోదు చేశాయి.మన భారత్ ర్యాంక్ 80 వ స్థానం లో ఉంది.2022 తో పోల్చితే అయిదు స్థానాలు పైకి వెళ్ళింది. మన దేశం పాస్ పోర్ట్ ఉన్నవాళ్ళు 57 దేశాల్ని వీసా లేకుండా చుట్టి రావచ్చు. ప్రస్తుతం మన దేశం ర్యాంక్ టోగో,సెనెగల్ దేశాలతో సమానం గా ఉంది.

ఇక ఆఫ్ఘనిస్తాన్ ర్యాంక్ అన్నిటికన్నా తక్కువ గా ఉంది.వారి పాస్ పోర్ట్ తో యెమెన్,పాకిస్తాన్,సిరియా, ఇరాక్ లాంటి 27 దేశాల్ని వీసా లేకుండా వెళ్ళవచ్చు. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే లండన్ కి చెందిన సంస్థ ఈ ర్యాంక్ ల్ని ప్రకటించింది. కాగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ వారి డేటా ని పరిగణన లోనికి తీసుకోవడం జరిగింది.   

--- NewsPost Desk

Tuesday 4 July 2023

గంజాయి కి, భంగు కి, చరస్ కి మద్య గల తేడా ఏమిటి

 

నిజానికి గంజాయి,భంగు,చరస్ ఈ మూడు ఒకే మొక్క నుంచి వస్తాయి. తయారు చేసిన విధానాన్ని బట్టి పేర్లు మారతాయి. భంగు ని ఉత్తర భారత దేశం లో హోలీ లాంటి పండగలప్పుడు సేవించడం ఏ నాటినుంచో వస్తున్నదే.గంజాయి మొక్కల ఆకుల్ని నలిపి ఆహారం లోనో,తాగే పానీయం లోనో కలుపుతారు.ఆ మొక్క కి పూసే పూవులు కూడా మంచి నిషాని కలిగిస్తాయి.వాటిని కూడా నలిపి మిశ్రమం గా చేసి వాడతారు.మన దేశం లో భంగు ని కొన్ని పూజల్లో వాడే సంప్రదాయం ఉన్నందున ఉత్తర భారతం లోని కొన్ని రాష్ట్రాల్లో కొంత మేరకు అనుమతి ఉంది.

భంగు బ్రెయిన్ మీద,నెర్వస్ సిస్టం మీద ప్రభావాన్ని చూపుతుంది. సైకోయాక్టివ్ ఎఫెక్ట్ కలిగిస్తుంది.ఎక్కువ సేవిస్తే మతిమరుపు,బలహీనత కలిగిస్తుంది. ఇక గంజాయి మొక్కల ఆకుల్ని,పూలని మరీ ముదరని దశ లో కోసి మిశ్రమం చేస్తారు. దీన్ని సిగెరెట్ లలో చుట్టుకొని పీలుస్తుంటారు.చిలుం పీల్చడానికి కూడా ఉపయోగిస్తారు. టీ లో కూడా కలిపి తాగుతుంటారు. ఇదొక పద్ధతి. గంజాయి దమ్ము అన్నమాట.

గంజాయి మొక్క ఇంకా దాని ఆకుల్లోని రసాన్ని తీసి తయారుచేసేది చరస్ లేదా హషిష్. చాలా ఎక్కువ కాన్సంట్రేషన్ ఉండేలా చూస్తారు. హషిష్ ని రోల్స్ గా చుట్టి పొగ తాగడం ఉన్నది. కొద్దిగా జిడ్డుగా ఉంటుంది.అలా గంజాయి మొక్కలో ఏదీ వేస్ట్ కాదు.ఆకులు,పూవులు,మొక్క రసం అన్నీ రకరకాలుగా ఉపయోగిస్తారు.     

Wednesday 14 June 2023

"కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు..." అనే జీవిత చక్రం లోని పాట ఎవరు మరిచిపోగలరు..?


 మధుర గాయని,విలక్షణమైన స్వరం తో ఎంతో మంది సంగీతాభిమానులను ఆకట్టుకున్న పాతతరం గాయని శారద నిన్న తన 86 వ యేట మృతి చెందారు. ముఖ్యంగా తెలుగు వారికి జీవిత చక్రం సినిమా లో పాడిన మధుర గాయని గా గుర్తు. "కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు...,మధురాతి మధురం మన ప్రేమ మధువు " లాంటి పాటలు ఎన్ని ఏళ్ళు మారినా మరిచిపోలేని పాటలు.శారద గొంతు లో ఒక గమ్మత్తు ఉండేది. ఓ చిన్నపిల్ల,అల్లరిపిల్ల పాడుతున్నట్లుగా ఉండేది.

తమిళనాడు లో జన్మించిన ఈమె పూర్తి పేరు శారదా రాజన్ అయ్యంగార్. హిందీ చిత్రసీమ లో తనదైన ముద్ర వేశారామె. Titli Udi అనే పాటతో (సూరజ్ చిత్రం,1966) ఆమె పేరు మారుమోగింది.రాజ్ కపూర్ ఈమె ని సంగీత దర్శకులు శంకర్ జైకిషన్ కి పరిచయం చేశారు. హేమామాలిని,షర్మిలా ఠాగూర్,సైరాబాను,రాజశ్రీ లాంటి హీరోయిన్ల కి పాడారు. ఫిల్ ఫేర్ అవార్డ్ పొందారు.

హిందీ మాత్రమే కాకుండా తెలుగు,తమిళ్,గుజరాతీ వంటి భాషల్లో సైతం పాడారు.ఆమె చివరిసారిగా సినిమాల్లో కాంచ్ కి దీవార్ కి పని చేశారు.గాలీబ్ గీతాల్ని ఆల్బం గా పాడారు.హిందీ సినీ పరిశ్రమ లో గల రాజకీయాల వల్ల శారద ఎక్కువ కాలం అక్కడ నిలబడలేకపోయారని అంటారు.ఏది ఏమైనా ఒక విలక్షణ గాయని గా సగీత అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిందామె.   

Friday 2 June 2023

ఈ మొక్కలంటే పాములకి ఇష్టం

మంచి సువాసన వెదజల్లే  నైట్ జాస్మిన్ మొక్కలన్నా, అలాగే గంధపు చెట్లు అన్నా పాములకి ఇష్టం అని పరిశోధకులు సెలవిస్తున్నారు. మన గ్రామాల్లో మొగలి పొదల వద్ద త్రాచుపాములు ఉంటాయని పెద్దలు అనేదాంట్లో కూడా కొంత నిజం ఉంది. ఎందుకంటే హాయిగా చక్కని సువాసన ని ఆస్వాదించే తత్వం కదా..!

మేరీ గోల్డ్, ఉల్లి,వెల్లుల్లి మొక్కల వాసన అంటే మాత్రం పాములకి పడదుట. అంతేకాదు లవంగాలు,దాల్చిన చెక్క రసాల్ని తీసి మిక్స్ చేసి పాములు చేరగూడదు అనుకున్న చోట స్ప్రే చేస్తే ఆ దాపుల్లోకి రావు. అలాగే తెల్ల వెనిగర్ ని చల్లినా దాని వాసన కూడా పడదు.

పాము కరిచిన వెంటనే ప్రాథమిక చికిత్స చేసి సాధ్యమైనంత త్వరగా డాక్టర్ వద్ద కి తీసుకు వెళ్ళాలి. స్నేక్ వెనం ఏంటి సిరం ఇంజెక్షన్ ని వాళ్ళు చేస్తారు. సొంతగా ఆ ఇంజెక్షన్ చేయవద్దు. పాము కరిచిన వెంటనే ఒంటి మీద టైట్ గా ఉండే రింగ్ ని గాని,బ్రాసిలెట్ వంటివాటిని తొలగించాలి.      

  

Saturday 13 May 2023

జపాన్, చైనా లాంటి సమాజాల్లో ఆర్దిక పరిస్థితి తో సంబంధం లేకుండా ఎందుకు నేల మీద పడుకుంటారు..?

 జపాన్ ప్రజలు నేటికి మంచం మీద కంటే నేల మీద పడుకోవడానికే ప్రాధాన్యమిస్తారు. ఆ పద్ధతి కొన్ని తరాలుగా ఆ దేశం లో అమలు లో ఉంది. కింద పడుకోవడం వల్ల వెన్నుబాము కి ఇంకా ఇతర శరీర అవయవాలకి పూర్తి విశ్రాంతి లభించి రక్తప్రసరణ బాగుంటుందని వారి సాంప్రదాయిక వైద్యం చెబుతోంది. కింద తతామి అనే చాప పరుచుకుని,షిక్ఫుటన్ అనబడే మెత్తటి పరుపు వేసుకుంటారు. రాత్రి వేళ పడుకునేటప్పుడు యుకట , జింబే అనబడే పైజామ లు ధరిస్తారు.అవి కాటన్ సిల్క్ తో లూజు గా కుట్టించుకుంటారు.

భారత దేశం లో మాదిరి గానే బిడ్డ పుట్టినతర్వాత తల్లి ఆ బిడ్డ తో ఓ రూం లో పడుకుంటే ,తండ్రి మరో రూం లో పడుకుంటాడు. ఇదే పద్ధతి చైనా లో కూడా అనేక తరాలుగా ఉన్నది.పదేళ్ళు వచ్చేవరకు చిన్నపిల్లలు ఎవరో కుటుంబ సభ్యుల దగ్గర పడుకుంటారు.



చైనా వాళ్ళు కూడా నేల మీద పడుకోవడానికే ప్రాధాన్యతనిస్తారు.ఒక చాప,దానిమీద మెత్తటి పరుపు,దిండు ఉంటుంది.కింద పడుకుంటే శరీరానికి ఆరోగ్యమని భావిస్తారు. ఫిలిప్పైన్స్,కొరియా ,వియాత్నం సమాజాలు కూడా ఇదే సంప్రదాయాన్ని పాటిస్తారు.భోజనం చేయడానికి కూడా కింద చాప వేసుకుని చిన్న చెక్క బల్ల ని ముందు పెట్టుకుని చేస్తారు.   

  ఈ తూర్పు దేశాల మాదిరి గానే మన దేశం లోనూ ఈ అలవాట్లు ఉండేవి. అయితే క్రమేపి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పూర్తి గా మారిపోతున్నాయి. తమిళనాడు లో మటుకు ఇప్పటికీ కూడా ఎంత ధనవంతులైనా చాప, దాని మీద పరుపు వేసుకుని పడుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేల మీద పడుకోవడం అనేది పేదరికానికి గుర్తు అని మన దేశం లో భావిస్తుంటారు. అయితే ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ చాలా తూర్పు ప్రాంత దేశాలు నేల మీద పడకే శ్రేష్టమని భావిస్తున్నారు. 

  ----- NewsPost Desk

Monday 8 May 2023

కుకీ ప్రజల గురించి కొన్ని కొత్త సంగతులు

 మణిపూర్ లో చెలరేగిన హింసాత్మక ఘటనలు దేశం మొత్తాన్ని కలవరపరిచాయి. కుకీ ఇంకా మైటే తెగల మధ్య జరుగుతున్న ఘర్షణ అందరినీ మరోసారి ఈశాన్య రాష్ట్రాల వైపు చూసేలా చేశాయి. అసలు ఈ కుకీ తెగ ప్రజలు ఎవరు అని ప్రశ్నించుకుంటే వీరు ఒక్క మణిపూర్ లోనే కాక నాగాలాండ్,మిజోరాం,అస్సాం వంటి రాష్ట్రలతో బాటు మైన్మార్, బంగ్లాదేశ్ లలో కూడా ఉన్నారు.మళ్ళీ వీరిలో కొన్ని ఉప తెగలు ఉన్నాయి.లుషాయ్,డార్లంగ్,రోఖంస్,సరిహద్దు ప్రాంతాల్లో ఉండే చిన్ ఇలా చెప్పవచ్చు.

                                                                     (Kuki women)

వీరు టిబెటొ బర్మన్ మంగోలాఇడ్ జూయిష్ ఎత్నిక్ కమ్యూనిటికి చెందినవారని శాస్త్రవేత్తలు అంటారు. ఖు అంటే గుహ అని అర్థం.దాన్నుంచి కుకి అనే మాట వచ్చింది.అత్యంత్  పురాతన తెగల్లో ఇది ఒకటి.జంతువులు,చెట్లు,పర్వతాలు ఇలాంటి వాటిని ఒకప్పుడు పూజించేవారు.ప్రస్తుతం అనేకమంది క్రైస్తవ మతం లోకి మారడం తో పాత పద్ధతులు అడుగంటాయని చెప్పాలి. విలియం పెట్టి గ్రు అనే బ్రిటీష్ మిషనరీ 1890 ప్రాంతం లో ఇక్కడికి ప్రవేశించి క్రైస్తవ మతాన్ని వ్యాపింప జేశాడు.క్రైస్తవ మతం రాకతో కుకీ సమాజం లో అనేక సాంఘిక పరమైన మార్పులు చోటుచేసుకున్నాయి.  

మణిపూర్ రాష్ట్రం లో కుకీ లు ముప్ఫై శాతం దాకా ఉంటారు. ముఖ్యంగా రాష్ట్రం నలుమూలలా ఉన్న పర్వతాల మధ్య వీరు జీవిస్తుంటారు. మైటే తెగ వారు అధికార కేంద్రానికి దగ్గరగా ఇంఫాల్ పరిసర ప్రాంతం లో ఎక్కువ ఉన్నారు.కుకీ తెగ ప్రజలు క్రైస్తవ మతం లోకి మారినప్పటికీ వారి గిరిజన తెగ హోదా అలాగే ఉంటుంది.ఈశాన్య రాష్ట్రాల కి దానికి సంబందించి కొన్ని ప్రత్యేక చట్టాలు ఉండటం వల్ల అలా కొనసాగుతోంది. కుకీ ప్రజలు సెప్టెంబర్ 13 ని బ్లాక్ డే గా పరిగణిస్తారు.అదేరోజు 1993 లో NSCN(IM) అనే మిలిటెంట్ సంస్థ 15 గ్రామాల్లోని కుకీల్ని చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా ఊచకోత కోసింది.

 ఈ మిలిటెంట్ సంస్థ నాగా తెగ కి చెందినది.ఈశాన్య ప్రాంతాల్లోని నాగా ప్రజల్ని,మైన్మార్ లో ఉన్న నాగా ప్రజల్ని ఏకం చేసి ప్రత్యేక దేశం గా ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నది.చైనా,పాక్ ల నుండి విరాళాలు వస్తుండేవి.2019 లో భారత సైన్యం వీరి గూఢచార నెట్ వర్క్ ని ధ్వంసం చేసి చాలా వరకు దీని ప్రభావాన్ని తగ్గించింది. ఈ NSCN సంస్థ ఓ వైపు మావో లతో కలిసిపనిచేస్తూనే మరోవేపు క్రైస్తవ మతం ఆధారంగా పనిచేస్తుంది."నాగాలాడ్ ఫర్ జీసస్" అనేది వారి స్లోగన్.


Sunday 23 April 2023

వీరు ఒక రకంగా హిందువులు, మరో రకంగా హిందువులు కారు

 మన దక్షిణ భారతం ఎన్నో రమణీయ దృశ్యాలకు పెట్టింది పేరు. దానిలో ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో ఉన్న కూర్గు ప్రాంతం తప్పక చూడదగినది. కర్ణాటక రాష్ట్రం లో ఉన్న ఈ జిల్లా బెంగుళూరు నుంచి 270 కి.మీ,మైసూర్ నుంచి 122 కి.మీ. ఉంటుంది.కూర్గు జిల్లా మొత్తం పచ్చని ప్రకృతి తో,జలపాతాలతో,కనువిందు చూసే కాఫీ తోటలతో అలరారుతూంటుంది. కూర్గు జిల్లాని మూడు తాలూకాలుగా విభజించారు. అవి మడికేరి,విరాజ్ పేట,సోమవార్ పేట. 


సంవత్సరం మొత్తం అంతా కూడా 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. అంత చల్లగా ఉంటూ ,కాఫీ పంట ఇంకా అరుదైన సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి కాబట్టి దీన్ని బ్రిటీష్ వారు స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు.ఇప్పటికీ మనవాళ్ళు అలానే పిలుస్తుంటారు. వీరి స్వీట్లు,వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి.బ్రహ్మాండమైన పశ్చిమ కనుమల అందాల్ని చూడాలంటే తప్పక ఇక్కడకి రావాలిసిందే.


(Kodagu people)

రకరకాల వైన్స్ ని తయారుచేయడం లో ఈ ప్రాంతానికి ఓ చరిత్ర ఉన్నది.ఇక్కడ నివసించే ప్రధాన ప్రజలు కొడవ జాతికి చెందినవారు.సైనిక లేద యోధ జాతికి చెందినవారిగా పరిగణించుకుంటారు.వీరి వేషభాషలు,సంస్కృతి,ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీరి ప్రధాన దైవం కావేరి నదీమాత.ఇంకా ప్రకృతి. తుపాకుల్ని సైతం పూజిస్తారు.కేలి మూర్త వీరి పండుగ.వీరి పెళ్ళిళ్ళు గాని శుభ కార్యాలు గాని అన్నీ ఆ కొడవ జాతి పెద్దలే నిర్వహిస్తారు తప్పా బ్రాహ్మల్ని పిలిచి చేయించడం ఉండదు. నిజానికి వీరిలో కులాలు,ఉపకులాలు ఏమీ ఉండవు. అందుకనే వీరు హిందువుల్లో ఉన్నా లేనట్లు గానే కొంతమంది పరిగణిస్తారు.