Tuesday 12 March 2024

ఈ విషయాలు చదివితే ఏ సూపర్ కంప్యూటరూ మెదడు ముందు సరిపోవు అనిపించక మానదు.

 ఏ కంప్యూటర్ తోనూ మన మెదడు ను పోల్చలేము. జ్ఞానేంద్రియాల నుండి వచ్చే ఆజ్ఞల్ని క్షణం లో స్వీకరించి వెంటనే ప్రాసెస్ చేసి రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. వరద లా వచ్చే సమాచారాన్ని ఎంతో వేగం తో ప్రాసెస్ చేస్తుంది.

 

మన మెదడు 100 బిలియన్ల సూక్ష్మమైన సెల్స్ తో తయారయింది. ఈ సెల్స్ నే న్యురాన్లు అంటారు. వాటన్నిటిన్నిటిని కౌంట్ చేయాలంటే 3000 ఏళ్ళు పడుతుంది.


కలగన్నా, చూస్తున్నా, కదులుతున్నా, ఆలోచిస్తున్నా ... ఈ న్యూరాన్లు చలిస్తూ ఎలెక్ట్రికల్ సంకేతాలు పంపించుకుటూ బిలియన్ల సంఖ్యలో కదలాడుతుంటాయి.


మనిషి జీవించి ఉన్నంతదాకా ఈ పని ఆగడం అనేది ఉండదు. ప్రపంచం లో ఆగకుండా మెసేజ్ లు పంపించే ఏకైక స్మార్ట్ ఫోన్ మన మెదడే అనుకోవచ్చు.


శరీరం లో ఉన్న సెన్సరీ న్యూరాన్స్ సమాచారాన్ని వెన్నుముక కి , బ్రెయిన్ కి గంటకి 240 కి.మీ. వేగం తో పంపిస్తాయి.


ఏ ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ ఒకేలా ఉండనట్లే , ఏ ఇద్దరి మెదడు యొక్క అనాటమీ ఒకేలా ఉండదు. 


--- NewsPost Desk  

Tuesday 16 January 2024

ఆల్ జాజిర అంటే ద్వీప కల్పం అని అర్థం.

 ఖతర్ దేశం ఈ మధ్య బాగా వార్తల్లో వినబడుతోంది. ఇంచుమించు 29 లక్షల జనాభా ఉన్న ఈ దేశం ప్రపంచం లోని ధనిక దేశాల్లో ఒకటి.

ఎంతో ఖ్యాతి చెందిన ఆల్ జాజిర మీడియా నెట్ వర్క్ ఈ దేశం లోని దోహా నుంచి పనిచేస్తుంది. ఆల్ జాజిర అంటే ద్వీప కల్పం అని అర్థం.

నిజానికి ఈ అంతర్జాతీయ న్యూస్ నెట్వర్క్ ఖతర్ ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ప్రపంచం లో 350 మిలియన్ కుటుంబాలకి ఇంకా 150 దేశాలకి ఈ వార్తాకదంబం అందుబాటు లో ఉంది.

వెబ్సైట్, యూ ట్యూబ్,టెలివిజన్, రేడియో ఇలాంటివి అన్నీ ఆల్ జాజిర నెట్ వర్క్ లో ఉన్నాయి. కేంద్ర స్థానం దోహా నగరం.

పర్ష్యన్ గల్ఫ్ లో ఉన్న ఈ బుల్లి దేశం లో చమురు,గ్యాస్ నిలవలు ఎక్కువ గా ఉండడం తో అత్యంత ధనిక దేశాల్లో ఒకటి గా మారింది.

1992 లో  మాస పత్రిక గా అరబిక్ భాష లో మొదలయి ఇంగ్లీష్ లో తన ప్రసారాల్ని 2006 లో మొదలుపెట్టింది.

ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యం లో భాగం గా ఉన్న ఖతర్, 1971 వరకు బ్రిటిష్ సమ్రక్షణ లో ఉన్నది. 90శాతం వరకు సున్నీ ముస్లింస్ ఉన్న ఈ దేశం లో 3,35,967 మంది హిందువులు కూడా ఉన్నారు.

--- NewsPost Desk

   

Saturday 23 December 2023

ఎందుకు MBBS కి అంత ఫీజు మన దేశం లో ?

 


ఎందుకు MBBS కి అంత ఫీజు మన దేశం లో ? విదేశాల్లో అంత ఎందుకు ఉండదు. అక్కడ వైద్య విద్య అంత నాణ్యత ఉండదేమో అనుకుంటారు చాలామంది. 

కాని అది నిజం కాదు. కిర్గిస్తాన్, రష్యా, చైనా, ఫిలిప్పైన్స్, కజకస్థాన్ ఇలాంటి దేశాల్లో మెడిసిన్ చదువు మన దేశం లో అంత ఖరీదు కాకపోయినా విద్య నాణ్యత లో ఏ మాత్రం తేడా ఉండదు.

 ఆ దేశాల్లో వైద్య విద్య చదివిన వారిని చిన్న చూపు చూడల్సిన పని లేదు.

మన దేశం లో ఉన్న విపరీతమైన డిమాండ్ ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లు సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక్కో రాష్ట్రం లో ఫీజులు ఒక్కోలా ఉన్నాయి. 

వీటిని అదుపు చేసే వ్యవస్థ లేకపోవడం విచిత్రం. కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సంవత్సరానికి గాను మూడు కోట్ల రూపాయల పైన వసూలు చేస్తున్నాయి.

 ఇక మెడిసిన్ అయిపొయేసరికి ఎంత అవుతుందో తేలిగ్గా ఊహించవచ్చు.

మన దేశం లో ప్రైవేట్,ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నీ కలిపి 1,04,333 సీట్లని కలిగి ఉంటే ,మొన్న 2023 NEET లో పరీక్ష రాసిన అభ్యర్థులు ఇరవై లక్షల మంది పై మాటే. 

మరి ఈ లెక్కన ఎంత పోటీ ఉందో చూడండి,అందుకే డబ్బులున్న వాడు ఎంతకైనా కొనుక్కుంటున్నాడు.

టాప్ 4 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల్లో మూడు దక్షిణాది లోనే ఉన్నాయి. ఎక్కువ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లు ఉన్న రాష్ట్రం కర్నాటక గా తేలింది. 

రమారమి 208 దాకా ఉన్నాయి. ప్రైవేట్ సీట్లలో తక్కువ ఫీజు తో దొరికే కాలేజ్ లు కర్నాటక,కేరళ,చత్తిస్ ఘడ్ లలో ఉన్నాయి. 

మెడిసిన్ మీద ఇష్టం లేకపోయినా, స్టేటస్ కోసం పెద్దల వత్తిడి తో మెడిసిన్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. మన సమాజం లో డాక్టర్ కి ఉన్న స్థానం అలాంటిది.

--- NewsPost Desk

Sunday 19 November 2023

సంప్రదాయ మీడియా మోనోపలీ ని చావుదెబ్బ కొట్టిన సోషల్ మీడియా

 ఈ రోజు ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భం గా కొన్ని విషయాలు చెప్పుకోవడం సముచితం గా ఉంటుంది. దూరదర్శన్ ప్రారంభమైన ఆ రోజుల్ని తలుచుకుంటే ఎంత దూరం ఈ డిజిటల్ యుగం లో ఎన్ని అనుభవాలతో ప్రయాణం చేశామో అర్థమవుతుంది. ఆశ్చర్యమూ కలుగుతుంది. ఆ చిత్రలహరి,వారానికి ఒకటో రెండో వచ్చే సినిమాలు వాటికోసం కాసుకుని కూర్చునే మనం...అదొక మరపురాని కాలం. ఆ తర్వాత ప్రైవేట్ చానళ్ళ వరద మనల్ని ముంచెత్తింది.

ఎన్ని పాటల,సినిమాల,వార్తల ప్రత్యేక చానెళ్ళు...ఏం కత. అన్నం తింటూ కూడా కళ్ళు అటు అప్పగించవలసిందే. వార్తల చానెళ్ళు అయితే చెప్పిందే చెప్పుకుంటూ ఇరవై నాలుగు గంటలూ అవే. ఇక మొబైల్స్ లో నెట్ రావడం ప్రారంభమైన తర్వాత ఇక చెప్పే పని లేదు.ప్రపంచ వార్తలు దగ్గర నుంచి పోర్న్ వరకు ప్రతి సైట్  ప్రతిఒక్కరి అర చేతి లోకీ వచ్చేసింది.చిన్నా పెద్దా లేకుండా ...అందుబాటు లోకి వచ్చిన ఈ అవకాశం ఎంత మంచి చేసిందో అంత మానసిక కాలుష్యానికి కూడా గురి చేసింది.


ఇక ఓటిటి ...ఇదో విప్లవం ఈ డిజిటల్ యుగం లో..! ఎన్ని భాషల సినిమాలు,వెబ్ సీరీస్ లు,ఇతర ప్రోగ్రాం లు చేతి మునివేళ్ళ దగ్గరకి వచ్చాశాయి.కపిల్ శర్మ ఇంటర్వ్యూలు,కాఫీ విత్ కరణ్,ఇంకా ఇలాంటి ఎన్నో డిమాండ్ ఉన్న కార్యక్రమాలన్ని ఓటిటి కి వచేశాయి.సెలబ్రిటీల పెళ్ళి కార్యక్రమాలు అవీ సరే సరి. ఒకదాని తర్వాత ఒకటి మార్పు వస్తూ ముందుకు పోతున్నదే తప్పా ఆగేదే లే అన్నట్లు గా ఉంది. యూ ట్యూబ్ లు,సోషల్ మీడియా లు వచ్చిన తర్వాత సంప్రదాయ మీడియా కి ఉన్న మోనోపలీ బద్దలైనందనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్నో డిజిటల్ పత్రికలు విజయవంతం గా దూసుకుపోతున్నాయి.

గూగుల్ క్రోంకాస్ట్, అమెజాన్ స్టిక్ లాంట్ డిజిటల్ మెటీరియల్స్ తో టి.వి. అనుసంధానమై నూతన ఒరవడులు పోతున్నది. ఇప్పటికీ 82 శాతం మంది సగటు భారతీయులు వినోదప్రధాన కార్యక్రమాలకి టివి మీదనే ఆధారపడుతున్నారు. సమాజం లో విలువలు మారిపోవడం లో ఈ మాధ్యమాలు చురుకైన పాత్ర పోషిస్తున్నాయి.కొన్ని అవాంఛనీయ పరిణామాలు కూడా ఏర్పడుతున్నాయి. సీరియల్స్ ప్రభావం మామూలుగా లేదు. కుటుంబ సంబంధాలు ఘోరం గా దెబ్బతింటున్నాయి.

ప్రస్తుతం గ్రామ సీమలు కూడా సోషల్ మీడియా వల్ల బాగా ప్రభావితం అవుతున్నాయి. ఏ మూలన జరిగేవీ వెంటవెంటనే తెలిసిపోతున్నాయి. ఒక మంచి ఏమిటంటే కొత్త టాలెంట్ బాగా బయటకి వస్తోంది. పాటగాళ్ళు గానీ, ఆటగాళ్ళు గానీ,మాటగాళ్ళు గానీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి తమకి నిజంగా సరుకు ఉంటే దానికి తగ్గా గుర్తింపు పొందుతున్నారు. ఎవరూ ఆపే ప్రసక్తే లేదు. ఏ అభిరుచి గలవాళ్ళకి ఆ అభిరుచి ఉన్న యూట్యూబర్లు దొరుకుతున్నారు. సాధ్యమైనంత వరకు మంచి విషయాలకి వాడుకుంటూ ముందుకి పోతే ఫర్వాలేదు. కానీ ఈ రెండంచుల కత్తిని ఇష్టం వచ్చినట్లు వాడితే నష్టబోయేదీ మనమే..!      

 --- NewsPost Desk

Tuesday 31 October 2023

ఈ భూమి మొత్తం మీద ఎన్ని రకాల మొక్కలున్నాయో తెలుసా..?

 


ప్రపంచం లో ఇప్పటిదాకా మూడు లక్షల ఎనభై వేల రకాలైన మొక్కల్ని వృక్ష శాస్త్రజ్ఞులు గుర్తించారు.దీంట్లో రెండు లక్షల అరవై వేల మొక్కలు విత్తనాలు ఇస్తాయి. ఏక కణ మొక్కల నుంచి మహా వృక్షాల దాకా ఈ భూమి ఉన్నాయి. మన దేశం లో చెప్పాలంటే 45,000 రకాల మొక్కల్ని గుర్తించారు. రమారమి లక్ష రకాల మొక్కల్ని గుర్తించి వాటి గురించి ఇంకా రాయవలసి ఉంది.

ఎక్కువ గా పూవులు పూచే మొక్కలే ఉన్నాయి. ప్రపంచం లో నాలుగు లక్షల రకాలైన పుష్పించే మొక్కలున్నాయి.వీటి రంగు,సైజు అనేక రకాలుగా ఉంటాయి. బ్రెజిల్ దేశం లో ఈ వృక్ష వైవిధ్యం, జీవ వైవిధ్యం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. వివిధ రకాల మొక్కలు, క్షీరదాలు ,చేపలు 50,000 పై చిలుకు ఉన్నాయి. ఇక మన దేశం కి వస్తే మర్రి చెట్టు ఇంచు మించు అన్ని ప్రదేశాల్లోనూ కనిపిస్తుంది. అందుకే దీన్ని జాతీయ వృక్షం గా ప్రకటించారు.

అడవి విషయానికి వస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానం లో ఉండగా,అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఒరిస్సా ఆ స్థానాల్లో వరుసగా ఉన్నాయి. గుజరాత్ లోని గాంధీ నగర్ లో 32 లక్షల వృక్షాలు ఉన్నాయి.ఇది ఒక రికార్డు. మొత్తం ఇండియా లో 35 బిలియన్ చెట్లు ఉండగా ,భూమి మొత్తం మీద 3 ట్రిలియన్ల చెట్లు ఉన్నట్లు భోగట్టా..!  

--- NewsPost Desk

Thursday 7 September 2023

94 ఏళ్ళు జీవించిన ఆయన మృత్యువు ని ముందుగానే ఊహించారా


 జయంత మహాపాత్ర (94) గత నెల 27 వ తేదీన పరమపదించారు. అప్పుడు కొన్ని వాక్యాలు రాద్దామని , ఎందుకనో రాయలేకపోయాను. చాలామంది రాసేశారు. కాని నాకు తోచింది నేను రాస్తాను. భారతీయాంగ్ల సాహిత్యం లో ముఖ్యంగా కవిత్వం కి సంబంధించి ముగ్గుర్ని త్రిమూర్తులు గా భావిస్తారు. వారు ఏ.కె.రామానుజన్, ఆర్. పార్థసారథి ఇంకా ఇటీవల మరణించిన జయంత మహాపాత్ర. ఇంచుమించు రెండు తరాల కిందట నుంచి జయంత పేరు ఇంగ్లీష్ సాహిత్యం చదివేవారికి సుపరిచితం. దేశ విదేశాల్లో కూడా..!

బొంబాయ్ నుంచి ఆ రోజుల్లో నిస్సిం ఎజికెల్, అరుణ్ కొలత్కర్ లాంటి వాళ్ళు రాసే ఇంగ్లీష్ కవిత్వం పరిచిన దారిని కాదని తనదైన ,తమ దైనందిన జీవితానికి సంబంధించిన ఇతివృత్తాలతో కొత్త దారిని పరిచినవాడు జయంత. ఇంగ్లీష్ కవిత్వమే గాని ఒరియా జీవితాన్ని ఆలంబనగా చేసుకుని రాసినది. కవిత్వం మాత్రమే కాదు కథలు,వ్యాసాలు కూడా ఆయన రాశాడు. మొత్తం 27 పుస్తకాల్లో ఇరవై పుస్తకాల్ని ఇంగ్లీష్ లోనూ ఏడు పుస్తకాల్ని ఒరియా భాష లోనూ జయంత రాశాడు.

విదేశీ పత్రికలు గుర్తించి ప్రచురించిన తర్వాతనే భారతీయ ఆంగ్ల పత్రికలు ఆయన రచనల్ని ప్రచురించడం మొదలుపెట్టాయి. ద న్యూయార్కర్,న్యూ ఇంగ్లండ్,చికాగో రివ్యూ,జార్జియా రివ్యూ, ద న్యూ రిపబ్లిక్ ఇలాంటి పత్రికలు మొదట్లో ఆయన ఇంగ్లీష్ కవిత్వాన్ని బాగా ప్రోత్సహించాయి. కేంద్ర సాహిత్య అకాడెమీ వారు ప్రచురించే బై మంత్లీ ఇండియన్ లిటరేచర్ లో ఇంకా ఇతర దేశీ పత్రికల్లో బాగా ఆయన రచనలు వచ్చేవి.

ఇంగ్లీష్ సాహిత్యం లో మొదటిసారిగా కేంద్ర సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ ప్రదానం చేసినది ఈయనకే. అవార్డులు, గౌరవ డాక్టరేట్లు గురించి చెప్పాలంటే చాలా లిస్ట్ ఉంది. స్వతహాగా ఫిజిక్స్ ఆచార్యుడైనప్పటికీ ఇంగ్లీష్ కవిత్వం వల్ల ఆయనకి ప్రత్యేకత ఒనగూరింది. చాలా లేటుగా అంటే తన 60 వ ఏట నుంచి కవిత్వం రాయడం మొదలెట్టారు. కటక్ నుంచి ఈయన వెలువరించే చంద్రభాగ అనే సాహిత్య పత్రిక భారతీయ ఇంగ్లీష్ సాహిత్యసేవ విషయం లో చెప్పుకోదగిన మైలురాయి.

సచ్చిదానంద మొహంతి అనే అభిమాని (రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్) జయంత మహాపాత్ర గురించి రాస్తూ ఆయన బాల్యం రెండు ప్రపంచాల మధ్య బాధాకరం గా సాగిందని,దాని గురించి చివరి దశలో మిత్రుల వద్ద చెప్పేవారన్నారు. జయంత మహాపాత్ర యొక్క తాత గారు క్రైస్తవ మతం స్వీకరించడం తో ఇంట్లో ఆ పద్ధతులు పాటించడం ఉండేదని, అయితే బంధువులు అంతా సనాతన సంప్రదాయవాదులు కావడం తో హిందూ మతానికి దూరమయ్యానని...అటూ ఇటూ ఏ మతానికి చెందని వాడిగా నా బాల్యం గడిచిందని దానివల్ల మానసిక క్షోభ కి గురయ్యానని చెప్పేవారు.

గ్ర్రాండ్ ఫాదర్ అనే కవిత నిజంగా వాళ్ళ తాత గారిని ఉద్దేశించి రాసిందే. దానికి బాగా పేరు వచ్చింది. 1866 లో వచ్చిన భయంకరమైన కరువు నుంచి రక్షించుకోవడానికి ఆయన కన్వర్ట్ అయినట్లు దానిలోని సారాంశం. ఆ రోజుల్లో కరువు నుంచి ఆదుకునే క్యాంపు ల్లో క్రైస్తవ మతం లోకి మారినవాళ్ళకి మాత్రమే ఆహారం ఇచ్చేవారట. దాన్ని దయనీయంగా ఆ కవిత లో వర్ణించారు జయంత.

94 ఏళ్ళు జీవించిన ఆయన మృత్యువు ని ముందుగానే ఊహించారా అనిపిస్తుంది. బర్డ్స్ ఆఫ్ వాటర్ అనే మీ కవితా సంకలనాన్ని డిసెంబర్ 2023 లో ప్రచురిస్తాను అని ఓ పబ్లిషర్ చెప్పినప్పుడు , నేను అంత వరకు బతికి ఉంటాననే అనుకుంటున్నావా అని జోక్ చేశారట. అదే నిజమైంది. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరిపింది.

--- మూర్తి కెవివిఎస్ 

Saturday 12 August 2023

" కోరాపుట్ అండ్ అదర్ షార్ట్ స్టోరీస్" ఓ విశిష్టమైన కథా సంపుటి.

 "కోరాపుట్ అండ్ అదర్ షార్ట్ స్టోరీస్" అనే ఈ కథాసంపుటి 15 విశిష్టమైన కథల తో నిండి ఉన్న పుస్తకం. గౌరహరి దాస్ గారు వీటిని ఒరియా భాషలో రాయగా సరోజ్ మిశ్రా,గోపా నాయక్ లు ఇంగ్లీష్ లోకి అనువదించారు. గౌరహరి దాస్ గారు ఒరియా భాష లో పేరు ప్రఖ్యాతులున్న పత్రికా సంపాదకులు మరియు రచయిత కూడా. అంతేకాదు మంచి నాటకరచయిత గా తనదైన ముద్ర వేశారు ఒరియా సాహితీ లోకంలో..! అటువంటి రచయిత యొక్క కథల్ని ఇంగ్లీష్ లోకి అనువదించడం వల్ల మనం అందరం చదివే అవకాశం కలిగింది. గతం లో కూడా ద లిటిల్ మాంక్ అండ్ అదర్ స్టోరీస్ పేరుతో ఓ కథాసంపుటి వెలువడింది. అది గౌరహరి దాస్ కథలు అనే పేరు తో తెలుగు లోకి కూడా అనువాదమై మంచి ఆదరణ పొందింది.  

ఈ పుస్తకం లోని ఆంగ్ల భాష చాలా సులువుగా ఉండటం వల్ల చదువరులు పెద్దగా కష్టపడనవసరం లేదు. మూల రచయిత భావం స్పష్టం గా అర్థమై ముందుకు వెళతాడు చదువరి. ఈ పుస్తకం లోని మొదటి కథ కోరాపుట్ నేపథ్యం లో సాగుతుంది. ఒరిస్సా లోని కోరాపుట్ ని ఒక్కసారైనా సందర్శించాలని కోరిక పుడుతుంది ఇది చదివినతర్వాత..! నిజానికి ఈ కథ తీవ్రవాద నేపథ్యం ని నింపుకుని అక్కడి స్థితిగతుల్ని, సాంఘిక వ్యవస్థ ని మనముందు నిలుపుతుంది. కోరాపుట్ ఒడిలోకి జారిపోయిన అనుభూతి కలుగుతుంది.

Once the sky was blue ఏఅ కథ ఈనాటి మాల్ సంస్కృతిని కళ్ళకి కడుతుంది. ఏ విధంగా చిన్న చిన్న వ్యాపారులు బడా మాల్స్ వల్ల నలిగిపోతారు అనేది చూపిస్తుంది. తలవంచడానికి ఇష్టపడని చిన్న వ్యాపారుల్ని ఎలా తమ ఆర్ధిక,అంగ బలాలతో చిదిమివేస్తారో ఈ కథ లో చదవవచ్చు. Mirage అనే కథ లో పన్నా జెనా అనే ఆకురౌడి జీవితాన్ని రమ్యం గా చిత్రించారు. ఏ బలాలకి లొంగని పొగరుబోతు ని ఏ విధంగా స్త్రీ ని ఉపయోగించి మట్టి గరిపించారో ఈ కథలో చదవవచ్చు. 

ఇక మీడియా రంగం లో వస్తోన్న మార్పులు గురించి ఓ కథ లో వివరించారు. విదేశీ పెట్టుబడులు పత్రికారంగం లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో చాలా విపులంగా తెలుసుకోవచ్చు.ఇలాంటి ఇతివృత్తాలతో కథ రాయడానికి చాలా ధైర్యం కావాలి.అంతేగాక బంగ్లాదేశ్ నుంచి బతకడానికి వచ్చిన కుటుంబం గురించి ఓ కథ లో చదవవచ్చు.విన్నూత్న అంశాలు ఈ సంపుటి లో గోచరిస్తాయి. కావలసినవారు అమెజాన్ నుంచి తెప్పించుకోవచ్చు.