Sunday 4 October 2020

ఆ రోజుల్లో ఇలాంటి శిల్పాల్ని చెక్కడం లో ఉద్దేశ్యం ఏమిటో..?

 


భోరం దేవ్ ఆలయం,ఇది చత్తీస్ ఘడ్ లో ఉన్న పురాతన దేవాలయాల్లో ఒకటి. ఇంచు మించు వెయ్యి ఏళ్ళ క్రితం నిర్మించిన ఈ నిర్మాణం శివుని కి అంకితం చేయబడింది.రాయపూర్ కి 125 కి.మీ. దూరం లో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే కబీర్ ధాం జిల్లా లోని కేవర్ధా కి 18 కి.మీ.దూరం లో ఉంటుంది.ఆలయం ఉన్న ఊరి పేరు చౌరా గాం.


నగర వంశానికి చెందిన రామచంద్ర ఈ ఆలయాన్ని నిర్మించాడు.హయ రాజవంశానికి చెందిన అంబికా దేవి ని ఈయన వివాహమాడాడు.చరిత్రని, పురాతన దేవాలయ నిర్మాణాల్ని పరిశీలించే వారికి ఇక్కడ ఎంతో సమాచారం దొరుకుతుంది.ఒరిస్సా లోని కొన్ని ఆలయాల నిర్మాణ పద్ధతులు ఇక్కడ కనిపిస్తాయి.అదే సమయం లో తనదైన ప్రత్యకత కూడా ఈ ఆలయానికి ఉంది.


ఖజురహో వంటి ఆలయాల తీరు లోనే ఇక్కడ కూడా అనేక శృంగార భంగిమల్లో స్త్రీ పురుషులు క్రీడించే శిల్పాలు విరివిగా ఆలయం గోడల పై కనిపిస్తాయి.అదొక్కటే కాదు,వాస్తు నిర్మాణ విశేషాలు కూడా ఆసక్తికరం గా ఉంటాయి.మార్చి నెల చివరి వారం లో ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి.  

Monday 6 July 2020

నాగా లు శునక మాంస ప్రియులా..?

నాగాలాండ్ మన దేశపు ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి అనే సంగతి అందరకీ తెలుసు.కానీ అక్కడి ప్రత్యేకమైన పండుగ గూర్చి ఎంత మందికి తెలుసు..?ఒక పక్షి పేరు మీదు గా ఆ పండుగ జరుగుతుంది. Hornbill Festival దాని పేరు. Hornbill అనే పక్షి కి నాగా సంస్కృతి లో విడదీయరాని సంబంధం ఉంది. అక్కడి కధల లోనూ,జానపద గీతాల లోనూ ఆ పక్షి కి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.అందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10 వ తేదీ వరకు కొహిమా దగ్గర లోని కొసిమా అనే ఊరి లో ఈ పండుగ నిర్వహిస్తుంది.దేశ విదేశాల నుంచి దీనికి చాలా మంది హాజరవుతుంటారు.



మొట్ట మొదటి గా 2000 వ సంవత్సరం లో ఈ పండుగ ని తమ ప్రత్యేకత అందరకీ తెలియజెప్పడం కోసం ప్రారంభించారు.అంగామి,రెంగామి,కుకీ,నాగా వంటి తెగలు ఈ రాష్ట్రం లో ఉన్నాయి. వారికి సంబందించిన విశేషాలు అంటే అక్కడి నృత్యాలు,శిల్పకళ,చేతి వృత్తుల వారి కళా స్వరూపాలు,పాటలు,ఆటలు,చిత్రకళలు ఒకటేమిటి ఇలాంటివి అన్నీ ఒకేచోట ఆ పది రోజుల పండుగ లో చూడవచ్చు.

నాగాలాండ్ రాష్ట్రం ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు.2013 లో జరిగిన జనగణన ప్రకారం నాగాలాండ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత నమోదయింది.అదేమిటంటే అక్కడి జనాభా మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ శాతం లో తగ్గినట్లు గా వెల్లడయింది.గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేదరికం చాలా ఇత్ర రాష్ట్రాల తో పోలిస్తే తక్కువేనని చెప్పాలి. నాగాలాండ్ లోని లోపలి ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే పర్మిట్ తీసుకోవాలి.మైన్మార్ కి (బర్మా) సరిహద్దు లో ఉండటం వల్ల విదేశీయుల కదలికలు నియంత్రించబడతాయి.



1967 లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ ని అధికార భాష గా ప్రకటించింది.నాగామీస్,క్రియోల్,అస్సామీస్ ఆధారిత భాషలు కూడా ప్రధానం గా ఉన్నాయి. 16 వివిధ తెగల తో వర్ధిల్లే ఈ రాష్ట్రం లో సంవత్సరం అంతా ఏవో స్థానిక పండుగలు జరుగుతూనే ఉంటాయి. శునక మాంస ప్రియులు అంటూ నాగా ల మీద ఉన్న అపోహ లో పూర్తి సత్యం లేదు. చాలా కొద్ది మంది మాత్రమే ఈ తరహా వారు ఉన్నారు.వారి జనాభా తో పోల్చితే అది చాలా తక్కువ.


















Tuesday 5 May 2020

కధాకళి ప్రత్యేకత ఇది




కేరళ రాష్ట్రం పేరు చెప్పగానే మనకి గుర్తు వచ్చేది కధాకళి నృత్యం.ఆ పాత్రలు పోషించే వారు వేసుకునే ఆ దుస్తులు,మేకప్ అవీ అన్నీ ప్రత్యేకం గా ఉంటాయి.ముఖ కవళిక ల తోను,కళ్ళ తోనూ,రకరకాల ముద్రల తోనూ భావ ప్రకటన చేస్తూ సాగుతుంది ఈ కళా రూపం.రామాయణం నుంచి ఇతర శైవ సాహిత్యం నుంచి పాత్రలను తీసుకుంటారు.16 వ శతాబ్దం నుంచి కధాకళి నిరాటంకంగా  కొనసాగుతూనే ఉన్నది.దీనిలో ప్రముఖం గా వాయించే వాయిద్యాలు మద్దల(పొడుగ్గా ఉండేది) , సెంట (నిలువు గా ఉండే డ్రమ్ములు) ,ఇడక్క (సౌమ్య పాత్రలకి వాయించే డ్రమ్ము) ఇలా ఉంటాయి.పద్మనాభన్ నాయర్ (జననం 7 అక్టోబర్ 1928) ని కధాకళి పితామహుని గా పిలుస్తారు. 


Sunday 16 February 2020

లక్ష దీవుల వంటకాలు అక్కడ ప్రత్యేకత



లక్ష దీవులు అంటే చాలా మందికి కేవలం మన దేశానికి చెందిన దీవులు మాత్రమే.కాని కేరళ కి చెందిన ముగ్గురు యువకులు మాత్రం ఆ దీవుల కి చెందిన రకరకాల వంటకాల్ని రుచి చూపించడానికి కేరళ లోని కోజికోడ్ లో ఒక హోటల్ ని తెరిచారు.హమిదుల్లా మహ్మద్,నౌషాద్, నిషాల్ పరంబిల్ అనే విద్యార్థులు సరదాగా తమ పాకెట్ మనీ కోసం ఈ దుఖాణం ని తెరిచారు.అయితే అది ఇప్పుడు  మంచి లాభాల్ని కూడా తెచ్చిపెడుతోంది.సముద్ర చేపలు,కొబ్బరి వంటకాలు అన్నీ కలిపి 20 రకాల వంటకాలు ఇక్కడ లభ్యమవుతాయి.కేవలం మేము 700 చదరపు అడుగుల స్థలం లోనే షాపు తెరిచాము.కష్టమర్లు బాగా సమకూరారు.ప్రస్తుతం మేము కొన్ని విదేశాలకి కూడా మా ఉత్పత్తుల్ని పంపిస్తున్నాము.ప్రభుత్వం అందిస్తున్న సాయం తో లక్ష దీవుల్లో కూడా బ్రాంచ్ పెట్టబోతున్నాము.టునా పికిల్,కోకోనట్ వినెగర్,టునా మాస్ పాపడ్,టునా మాస్ ఫ్రై,ఇలాంటివే కాకుండా లక్ష దీవుల్లో లభ్యమయ్యే ఔషధ ఉత్పత్తుల్ని కూడా విక్రయిస్తున్నాము అని ఆ యువకులు అంటున్నారు.    

Tuesday 8 October 2019

గుడి సముదాన్ని రక్షించమని కోరుతున్న చంబల్ బందిపోట్లు



బందిపోట్లు గా జనాల్ని ఒకనాడు గడ గడ లాడించిన చంబల్ లోయ నివాసులైన మొహర్ సింగ్ గుర్జర్,నిర్భయ్ గుర్జర్ చంబల్ లోయ లో ఉన్న బాటేశ్వర్ దేవాలయ సముదాయాల్ని ప్రభుత్వం ఇకనైనా పట్టించుకుని వాటిని సమ్రక్షించాలని కోరుతున్నారు.వాళ్ళు ఈ మేరకు ప్రధానికి కూడా వినతి పత్రాలు సమర్పించారు.భూతేశ్వర్ అనే మాట బాటేశ్వర్ అయి ఉంటుందని పరిశోధకుల అంచనా.ఇంతకీ గుళ్ళ ప్రత్యేకత ఏమిటంటే దాదాపు 400 వరకు ఒకే కాంప్లెక్స్ లో ఉంటాయి.రమారమి 25 కి.మీ.ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చిన్న చిన్న గుళ్ళు దాదాపు ఏడు వందల ఏళ్ళ క్రితం గుర్జర-ప్రతిహార రాజులు నిర్మించినవని చరిత్ర.

ఈ సముదాయాన్ని మన దేశపు అంగోర్ వాట్ టెంపుల్ గా పిలుస్తారు.అనేక ఏళ్ళ పాటు అడివి లో ఉండిపోయి అనుకోని విధం గా కనుగొనబడ్డాయి.చాలా ప్రాంతం వరకు కూలగొట్టబడిన గుళ్ళ యొక్క శిధిలాలు పరుచుకుని ఉన్నాయి.ముందు ఇవి కనుగొనబడినప్పుడు ఏవో కొన్ని నిర్మాణాలు ఉండి ఉండవచ్చునని అనుకున్నారు కాని రమారమి 400 గుళ్ళ దాకా ఇప్పుడు లెక్క తేలింది.ఇవి ముస్లిం రాజుల దండయాత్రల్లో ధ్వంసం చేయబడినవా లేదా భూకంపం వచ్చి ఇలా అయినవా అనేది పూర్తిగా నిర్ధారింప బడలేదు.శివుడు,విష్ణువు,పార్వతి,గణేషుడు వంటి దేవతలకి ఇవి అంకితం చేయబడ్డాయి.బందిపోట్లు గా పేరు పొందిన చాలామంది వారి కార్యకలాపాలకి ముందు తమ ఇలవేల్పులైన ఈ దేవుళ్ళ గుళ్ళని దర్శించి పూజించి మరీ వెళ్ళేవారు.









  

Sunday 21 July 2019

ఏనుగుల్ని చంపడానికి యుథనేషియా చట్టం..?


దేశం లో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా పట్టుబడి బతుకీడుస్తున్న ఏనుగుల సంఖ్య ఎక్కడ ఉన్నదో తెలుసా..? కేరళ రాష్ట్రంలోనే..! రమారమి 507 ఏనుగులు ఆ జాబితాలో ఉన్నాయి. వివిధ దేవాలయాల్లోనూ,ఉత్సవాల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు.అయితే కొన్నిసార్లు ఈ ఏనుగుల్లో కొన్ని అనారోగ్యం బారిన పడి బతుకు భారంగా వెళ్ళదీస్తుంటాయి.అలాటి వాటిని కారుణ్య ధృక్పథం తో చంపడానికి యుధనేషియా చట్టాన్ని తెచ్చేందుకు కేరళ రాష్ట్రం ప్రయత్నిస్తోంది.దీనికి తగిన సిఫార్సులను సంబందిత నిపుణులనుంచి తీసుకుంటున్నది.ఈ మధ్య కాలం లో ఏనుగుల్ని నిర్లక్ష్యం గా చూసే మావట్లను రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.ఏనుగులకి వాటి కి సరిపడే ఆహారం ఇవ్వాలి తప్పా తాము ఏది పడితే అది వాటికి పెట్టరాదని దాని సారాంశం.ఏనుగుల మావట్లను తరచూ మార్చరాదని దానివల్ల ఆ జంతువులు ఇబ్బందుల పాలవుతున్నాయని అక్కడి అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.   

Monday 15 April 2019

సైకత శిల్పి ని ఈ రోజు గుర్తు తెచ్చుకోవలసిందే..!



అనేక మార్లు మనకిది అనుభవమే..! మనం పేపర్ తెరవ గానే పూరి బీచ్ లో వేసిన  ఇసుక శిల్పాన్ని చూస్తాము,ఇంకా దానితో బాటుగా చక్కటి సందేశాన్ని కూడా చూస్తాము.దాన్ని చిత్రించిన శిల్పి సుదర్శన్ పట్నాయక్ అనే పేరు ని కూడా చదివి ఉంటాము.ఈరోజు అతని పుట్టిన రోజు.ఎన్నో దేశ విదేశీ సైకత శిల్పాల పోటీల్లో ఫాల్గొని తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న తనకి ఆ కళ ఎన్నో డాక్టరేట్లని,పద్మశ్రీ  అవార్డ్ ని తెచ్చిపెట్టింది.అయితే ఆ పూరీ కుర్రవాని జీవితం ని తెలుసుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి.నిజానికి తను డిగ్రీ కూడా చదవలేదు.చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు.తండ్రి ఇంటినుంచి చిన్న తనం లోనే వెళ్ళిపోఅయడు.అయితేనేం తన సృజనా శక్తి తో తన విధిని తనే లిఖించుకున్నాడు.

చిన్నతనం లో ఒక ఇంట్లో పనిమనిషి గా చేసేవాడు.అక్కడ పిల్లలు వేసే బొమ్మలు చూసి తనలో సహజం గా ఉన్న కళ ని మెరుగులు దిద్దుకునేవాడు.ఖరీదైన పేయింట్స్ కొనే స్థోమత లేక పోవడం వల్ల పూరీ బీచ్ కి వెళ్ళి అక్కడ ఇసుక తో రకరకాల బొమ్మలు వేసేవాడు.అవి చూసిన జనాలు మెచ్చుకునే వారు ,అయితే ఇసుక తో వేస్తే అవి ఎంత కాలం ఉంటాయి,గాలి వచ్చినా అలలు వచ్చినా కొట్టుకుపోతాయి గదా అని నిరాశగా అనేవారు.అయితే తనకి మాత్రం దీనిలో బాగా నమ్మకం ఉండేది.ఒక రాత్రి పడుకున్నప్పుడు అనిపించింది ,అసలు జీవితమే పర్మినెంట్ కాదు అలాగని చచ్చిపోతున్నామా అని అనిపించింది.దీనికి
ఒక కొత్తదనాన్ని జోడించాలి,అప్పుడు ఇంకా బాగుంటుంది అని తోచి బొమ్మ వేసి దానికి కేప్షన్ ని సింపుల్ గా,శక్తిమంతం గా రాసేవాడు.క్రమేపి జనాలు వీటిని ఆదరించారు.ప్రాచుర్యం పొందిన తర్వాత ఫలాన సంఘటన కి ఏ బొమ్మ వేసి ఏ కేప్షన్ పెడతాడు అని లోకం ఎదురు చూడసాగింది.దేశ విదేశాల్లో ఎన్నో బహుమతులు పొందాడు.పత్రికలు దేశ వ్యాప్తం గా పోటీలు పడి తన చిత్రాలు ముద్రిస్తుంటాయి ఈరోజున.నాలో ఉన్న సహజ కళ ని నమ్ముకొని ముందుకి పోయిన నన్ను ఆ కళే పైకి తెచ్చింది.ప్రతి ఒక్కరి లోను ఏదో ఒకటి ఉంటుంది,దాన్ని గుర్తించి జీవితాన్ని అర్పించిన రోజున అది తప్పక మనిషి కి అన్నీ ఇస్తుంది అంటాడు మన సుదర్శన్ పట్నాయక్.